వ్యక్తి ఆత్మహత్య కేసులో 8 మందికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

వ్యక్తి ఆత్మహత్య కేసులో 8 మందికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఎనిమిది మందికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కే. కిరణ్‌కుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు.

అశ్వాపురం మండలానికి చెందిన మొండికుంట గ్రామ నివాసి గూడూరు శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం — ఆయన తండ్రి గూడూరు మల్లారెడ్డికి రెండు ఎకరాల వారసత్వ భూమి ఉంది. ఆ భూమిని ఆక్రమించుకునేందుకు అదే గ్రామానికి చెందిన మేడవరపు మంగపతిరావు, మేడవరపు సుధీర్, మేడవరపు సురేష్, పర్వత నరేష్, తుక్కని రామిరెడ్డి, కాసరబాడ సత్యం, కాసరబాడ రాములు, కాసరబాడ సందీప్, గూడూరు జనార్దన్‌రెడ్డి తదితరులు బెదిరింపులకు దిగారని తెలిపారు.

గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ భూమిని తిరిగి ఇవ్వకుండా బాధితుడిని అవమానపరిచారని, నాలుగు రోజుల ముందు కూడా పై వ్యక్తులు “నువ్వు చనిపో లేకపోతే మేమే చంపేస్తాం” అని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆవేదనకు గురైన గూడూరు మల్లారెడ్డి 2021 మార్చి 3న తన వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. రాజు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా 12 మంది సాక్షులను కోర్టు పరిశీలించింది. విచారణలో ఉన్న సమయంలో కాసరబాడ సత్యం మరణించాడు.

విచారణ అనంతరం మేడవరపు మంగపతిరావు, మేడవరపు సుధీర్, మేడవరపు సురేష్, పర్వత నరేష్, తుక్కని రామిరెడ్డి, కాసరబాడ రాములు, కాసరబాడ సందీప్, గూడూరు జనార్దన్‌రెడ్డిలపై నేరం రుజువై, ఎనిమిది మందికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదనలు వినిపించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్‌ఐ డి. రాఘవయ్య, లైజాన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ ఎం. ఈశ్వరరావు ఈ కేసు నిర్వహణలో సహకరించారు.

Advertising:



Blogger ఆధారితం.