మోడీ నిర్ణయం పత్తి రైతుకు శాపం - ఏఐసీసీ నాయకులు నుమాన్
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పత్తి రైతుకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయని ఏఐసీసీ నేషనల్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ నుమాన్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నుమాన్ మాట్లాడుతూ అమెరికా పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేసిన మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ, విదర్భ, మరాఠా, గుజరాత్, పంజాబ్ రైతులకు నేరుగా ద్రోహం చేస్తుందని విమర్శించారు. పత్తి ఉత్పత్తికి పదివేలకు పైగా ఖర్చు అవుతుండగా కనీస మద్దతు ధర 7,710 నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో రైతులు నేరుగా 2,365 రూపాయలు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి నిర్ణయంతో దేశవ్యాప్తంగా 18,850 కోట్ల మేర రైతులు నష్టపోతారని అన్నారు. ఇలా నష్టపోయిన రైతులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరిగి చివరకు ఏమీ చేసేది లేక ఆత్మహత్యలే శరణ్యంగా భావించే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం విదేశీ పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని, కనీస మద్దతు ధరను పెంచాలని, బలహీన ప్రాంతాలలో రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రక్షణ ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Advertising:


Post a Comment