రక్తదానం చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

రక్తదానం చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మణుగూరులోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన రక్త నిల్వ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి  పాటిల్ రిబ్బన్ కట్ చేసి బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా రక్తదానం చేసి, ప్రజల్లో రక్తదానంపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “రక్తదానం అంటే ప్రాణదానం. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఇతరులకు జీవం పోస్తుంది అని అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలి” అని పిలుపునిచ్చారు.

రక్తదానం చేయడం ద్వారా రక్తహీనతతో బాధపడే గర్భిణీలు, తలసీమియా, సికిల్ సెల్, అనీమియా వంటి రోగులు, అలాగే ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ రక్తం ప్రాణరక్షణగా మారుతుందని ఆయన అన్నారు.

మణుగూరులో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు కావడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రక్తం సమీపంలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటి వరకు రక్త అవసరాల కోసం ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇకపై అలాంటిది అవసరం ఉండదని కలెక్టర్ తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఇచ్చిన స్ఫూర్తితో డి.సి.హెచ్.ఎస్ డాక్టర్ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 20 మంది రక్తదానం చేశారు. నూతనంగా ప్రారంభించిన రక్త నిల్వ కేంద్రానికి సరిపడా రక్త నిల్వల కోసం ఈ రక్తాన్ని వినియోగిస్తామని పేర్కొన్నారు.

Blogger ఆధారితం.