భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్

 భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వరదలు సంభవించే ప్రాంతాలను గుర్తించి, అక్కడ నివసిస్తున్న ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వరద ప్రవాహ సమయంలో నదులు, కాలువలు, చెరువులు వంటి జలవనరుల వద్దకు వెళ్లకూడదని, వాటిని దాటేందుకు ప్రయత్నించరాదని స్పష్టం చేశారు.

అలాగే, రహదారులు మరియు కల్వర్టులపై నీరు ప్రవహిస్తున్న చోట్ల అధిక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. తాగునీరు కలుషితమయ్యే అవకాశాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడుతూ, వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. రైతులకు అవసరమైన సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ సరఫరా నిలిచిన సందర్భంలో ఆసుపత్రుల్లో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రసవానికి సమీపించిన గర్భిణీలను ముందుగానే ఆసుపత్రులు లేదా గర్భిణీల వసతి కేంద్రాలకు తరలించాలని సూచించారు.

Blogger ఆధారితం.