జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పహల్గామ్ (జమ్మూ & కాశ్మీర్) లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జమాతే ఇస్లామీ హింద్ – పాల్వంచ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పాల్వంచ పట్టణంలోని స్థానిక అల్ కౌసర్ మస్జిద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ, అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగింది.
దేశంలో శాంతి, ఐక్యతకు విఘాతం కలిగించే ఉగ్రవాద దాడులను నిరసిస్తూ, పౌరులపై జరిగే హింసాత్మక చర్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ జమాతే ఇస్లామీ హింద్ నాయకులు, ముస్లిం సోదరులు, సోదరీమణులు, చిన్నారులు మౌనం పాటిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా పాల్వంచ జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు ముర్తుజ అలీ ఖాన్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు యం.డి. మంజూర్ మాట్లాడుతూ “ఇది ఒక పిరికిపందల చర్య. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 28 మంది పౌరులు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి దారుణాలు తిరిగి జరగకుండా కాశ్మీర్లో భద్రతా పటిష్టతను ప్రభుత్వం గట్టిగా సమీక్షించాలి” అని పేర్కొన్నారు.
ఈ ర్యాలీలో జమాతే ఇస్లామీ హింద్ నాయకులు ఆసిఫ్ అఫ్జల్, జావిద్, షరీఫ్, రషీద్, రబ్బాని, ముజాహీద్, SIO ప్రతినిధులు ఆఖిబ్, సమద్, సమీ, అలీ షా, మహిళా నాయకురాలు నజ్మ, కౌసర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment