పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు డయాలసిస్ బెడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)లో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు 5 డయాలసిస్ బెడ్లను కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 10 బెడ్లతో కొత్తగూడెంలో, 5 బెడ్లతో పాల్వంచలో ఉన్న డయాలసిస్ రోగుల సంఖ్యకు అనుగుణంగా మిషన్లు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర డయాలసిస్ రోగులు ఇల్లందు, భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుండటాన్ని గమనించి వెంటనే వైద్యశాఖ మంత్రి, అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు పంపి ₹40 లక్షల రూపాయలతో ఇక్కడ యూనిట్ ప్రారంభించామని తెలిపారు.
ఇప్పుడు అదనంగా పాల్వంచలో ఐదు, కొత్తగూడెంలో ఐదు బెడ్లను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంత రోగుల బాధలు తీరుతాయన్నారు. నియోజకవర్గానికి అదనంగా మరో ఐదు బెడ్లు రానున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని డయాలసిస్ బెడ్లు లేవని వెల్లడించారు.
79 లక్షలతో ఆసుపత్రి ఆధునీకరణ పనులకు ప్రతిపాదనలు పంపగా పరిపాలన అనుమతులు వచ్చినందున త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. విద్య, వైద్యానికి తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించి సరైన వైద్యం అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత, సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, డి. సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, శనగారపు శ్రీనివాసరావు, మన్యం వెంకన్న, జకరయ్య, నరహరి నాగేశ్వరరావు, వైఎస్ గిరి, బీవీ సత్యనారాయణ, రెహమాన్, కరీం, లాల్ పాషా, ఆదినారాయణ, హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆర్.ఎం.ఓ, ఆరోగ్యశ్రీ అధికారులు, డయాలసిస్ అధికారులు, విద్యుత్, రెవెన్యూ శాఖల అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment