సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు - జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు. జిల్లా పరిధిలోని పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలనీలు, ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని, సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. దొంగతనాల నివారణకు, రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
జిల్లాలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలను అరికట్టవచ్చని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసుల్లో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
నేరాలను ఛేదించడంతో పాటు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని, కావున జిల్లా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ, తమ నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Post a Comment