పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం. ఆటపాటలు, చిలిపి పనులు, కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని మన వెన్నంటే ఉండి "నేనున్నాను" అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం. ఆనందం, బాల్యం, స్మృతులు, కరచాలనాలు, చెమ్మగిల్లిన కళ్లతో అలింగనాలు, గురువుల మందలింపులు తలచుకుంటూ ఒకసారి వయస్సు మర్చిపోయి చిన్న పిల్లల కేరింతలతో పాఠశాల ఆవరణం కోలాహలంగా మారింది.
ఈ ప్రాంగణంలో అడుగు పెడుతూనే హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బొల్లోరుగూడెం ప్రభుత్వ పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది.రెండు దశాబ్దాల తర్వాత ఎక్కడెక్కడికో వెళ్లిన వారు కొందరు, ఎక్కడెక్కడో స్థిరపడిన వారు కొందరు, ఉద్యోగాల్లో కొందరు, సహధర్మచారిణులుగా కొందరు, వివిధ స్థితుల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలనే కలంపులో ఆనాటి విద్యార్థులైన కొంతమంది విద్యార్థులకు ఆలోచన కలిగింది. ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు, తమ కుటుంబ పరిస్థితులు, నాటి చిలిపి చేష్టలను, క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.దివంగతులైన ఉపాధ్యాయులు బ్రహ్మచారి, రాజు (తెలుగు పండిట్), ఇందిర (సైన్స్ టీచర్), పి.ఇ.టి మురళి వారికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, నాగేశ్వరరావు, సుధాకర్, పద్మలత, జే.వి.ఆర్, శ్రీనివాస్, వి.టి.ఆర్, కూర్మేశ్వరరావు, సీతారామలక్ష్మి, శారద, శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు, పాటలు అలరించాయి. వచ్చిన పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో పొద్దుపోయే వరకు గడిపి, బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్యస్థానాలకు వారు కదిలారు.

Post a Comment