గంజాయి కేసులో ముగ్గురికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :గంజాయి కేసులో ముగ్గురికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి (ఎఫ్.ఏ.సి. స్పెషల్ జడ్జి ఫర్ ఎన్. డి. పి. ఎస్.మొదటి అదనపు జిల్లా జడ్జి ) పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు.
కేసు వివరాలు ఇలా...టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ జి. ప్రవీణ్ కుమార్ 2019 నవంబర్ 11న టేకులపల్లి సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా మహబూబాబాద్ గూడూరు మండలానికి చెందిన భూక్య రాము, బోడా సుమన్, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పల్లిపాడుకు చెందిన బొంతు శంకరయ్య పసుపు రంగు గల టీఎన్ నెంబర్ గల ఆటోను టేకులపల్లి బోడు వద్ద ఆపి పరిశీలించారు. ఆ ఆటోలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించగా, వాటి బరువు 31 కేజీ 165 గ్రాములు, విలువ రూ. 4,67,470/-గా నిర్ధారించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
దర్యాప్తు అనంతరం అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాజు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టులో ఐదుగురు సాక్షుల విచారణ అనంతరం, ముగ్గురిపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ (ఎస్ఐ) జి. ప్రవీణ్ కుమార్, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎస్.కె. అబ్దుల్ ఘని, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పులి రమేష్ లు సహకరించారు.

Post a Comment