జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - కలెక్టర్

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి - కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండాజోల్ మాత్రలను అందించాలన్నారు.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలలో ప్రతి విద్యార్థికి మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మాత్రల ద్వారా పిల్లల్లో రక్తహీనత, బుద్ధిమాంద్యం నివారించవచ్చని, చదువుల పట్ల ఏకాగ్రత పెంపొందుతుందని తెలిపారు. విద్యాశాఖ, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలు సమన్వయంగా పనిచేసి జిల్లాలోని విద్యార్థులందరికీ మాత్రలను అందించాలని సూచించారు.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడి పిల్లలకు మాత్రలు అందించాలన్నారు. అంగన్వాడి టీచర్లకు శిక్షణ ఇచ్చి వయస్సుల వారీగా మాత్రల డోస్ ఇవ్వాలని సూచించారు. భోజనం తర్వాతనే ఆల్బెండాజోల్ మాత్రలు వేయించాలన్నారు. మాత్రలు వేసే ప్రదేశంలో తగినంత త్రాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

జిల్లాలో 3,36,212 మంది 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారు ఉన్నారని, వారి అందరికీ మాత్రలు అందించాలని తెలిపారు. ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించి నులిపురుగుల నిర్మూలన మాత్రలను అందించాలన్నారు. ప్రజలకు ఆల్బెండాజోల్ మాత్రల ప్రయోజనాలపై కళాజాత బృందాలు, మహిళా సమాఖ్యల ద్వారా విస్తృత అవగాహన కల్పించి, పిల్లలందరూ మాత్రలు తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. 10వ తేదీన మాత్రలు తీసుకున్న వారికి 17వ తేదీన మాప్-అప్ డే నిర్వహించి మరలా మాత్రలు అందించాలని సూచించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా అన్ని విద్యార్థులకు మాత్రలు అందేలా చూడాలని, అనంతరం నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నులిపురుగుల నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, వైద్య శాఖ అధికారి భాస్కర్ నాయక్, డీసీహెచ్ఓ రవిబాబు, మహిళా, శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, ఎస్సీ డెవలప్‌మెంట్ అధికారి అనసూయ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.