కేసుల పరిష్కారం కోసం కృషి చేయండి - న్యాయమూర్తి జి. భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కోర్టులో మార్చి 8న జరిగే జాతీయ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసుల్లో కక్షిదారులకు న్యాయం జరగాలని తెలిపారు. లోక్ అదాలత్లో రాజీపడటం వలన కక్షిదారులకు సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుందని పేర్కొన్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. రాజీపడదగిన క్రిమినల్, సివిల్, మనోవర్తి, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంకు కేసులను పరిష్కరించుకోవడానికి కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో కొత్తగూడెం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఏ. నీరజ, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ. సుచరిత, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన సీనియర్ న్యాయవాదులు గాదే రామచంద్ర రెడ్డి, రావి విజయ్ కుమార్, ఏ. రాంప్రసాద్ రావు, వి. నాగిరెడ్డి, అంబటి రమేష్, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment