రాజకీయ పార్టీలు సహకరించాలి - స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : భద్రాచలం, సారపాక గ్రామపంచాయతీలలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఆమోదం, అభ్యంతరాల స్వీకరణపై జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అధ్యక్షతన సోమవారం ఐ.డి.ఓ.సి కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 30 విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం భద్రాచలం మరియు సారపాక గ్రామపంచాయతీలలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఆమోదం మరియు అభ్యంతరాల స్వీకరణ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు పూర్తి చేయుటలో రాజకీయ పార్టీలు సహకరించాలని అన్నారు. ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు.
భద్రాచలం గ్రామపంచాయతీలో 41,008 మంది ఓటర్లకు 60 పోలింగ్ కేంద్రాలు, సారపాక గ్రామపంచాయతీ పరిధిలో 19,045 మంది ఓటర్లకు 36 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 11 తేదీన మండల స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, ఏదైనా పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై అభ్యంతరాలు లేదా ఓటర్లకు దూరంగా ఉన్నట్లయితే, ఫిబ్రవరి 12 తేదీన లిఖితపూర్వకంగా స్థానిక ఎంపీడీవోలకు అందజేయాలని సూచించారు. ఫిబ్రవరి 14 తేదీన తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, నేషనల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Post a Comment