ఆదివాసిల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి - సీఎం రేవంత్ రెడ్డి
జె.హెచ్.9. మీడియా, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఆదివాసీ ప్రతినిధులు విద్య, ఉద్యోగాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి సమస్యలపై విన్నవించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆదివాసిల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా, కొమురం భీమ్ జయంతి, వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చడం, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే చేపట్టినట్లు సీఎం తెలిపారు. అదేవిధంగా, ఐటీడీఏ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు, తాగునీటి సమస్యల పరిష్కారం, బోర్లు, సోలార్ పంపుసెట్లు ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
ఆదివాసీ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ, మాతృభాషలో విద్య అందించే అంశాన్ని అధ్యయనం చేసి నివేదిక అందించాలన్నారు. స్టడీ సర్కిల్ ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు మంజూరు చేస్తామన్నారు. అదనంగా, విదేశాల్లో చదువుతున్న ఆదివాసీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ ప్రతినిధులు ఆత్రం సక్కు, గోడం గణేష్, మేస్రం మనోహర్, మర్స్ కోల తిరుపతి, టేకం భాస్కర్, జుగున్క దేవు, సర్మేది కొడప హన్ను పటేల్, ఆద అమృతరావు, మేస్రం మోతీరాం, ఆత్రం సుగుణ, ప్రొ. గుమ్మడి అనురాధ, ప్రొ. అప్క నాగేశ్వర రావు, ప్రొ. రేగ రాజేందర్, ప్రొ. సిదం కిశోర్, సిదం జగ్ను, ఆత్రం లక్ష్మణ్, సోయం భీంరావు, సిదం అర్జున్, బుర్సా పోచయ్య, మేస్రం గంగారాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment