భూమాత మాడ్యూల్ అమలుకు ముందే సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న భూమాత పోర్టల్ అమలకు ముందు మాడ్యూల్లో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కార చర్యలపై మంగళవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్తో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమాత మాడ్యూల్ అమలులో భాగంగా పోర్టల్లో తలెత్తే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలకు తీసుకోవాల్సిన చర్యలను అందరూ తహసీల్దార్లు లిఖితపూర్వకంగా నిర్దేశిత పట్టిక ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వచ్చిన సూచనలు, సలహాలను ఉన్నతాధికారులకు పంపించడం ద్వారా మాడ్యూల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు.
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్.ఓ.ఆర్. చట్టం మరియు కొత్త చట్టంపై తహసీల్దార్లకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల పరిధిలో ఉన్న అటవీ శాఖ భూముల వివరాలను అటవీ శాఖ గెజిటెడ్ మరియు రెవెన్యూ రికార్డులతో సరిచూసి, ఏ సర్వే నంబర్లలో ఎంత అటవీ భూములు ఉన్నాయో గుర్తించాలని ఆదేశించారు. దీని ద్వారా మిగిలిన ప్రభుత్వ భూములను ఎయిర్పోర్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు వంటి అభివృద్ధి పనులకు ఉపయోగించవచ్చని కలెక్టర్ తెలిపారు.

Post a Comment