వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది - ఎస్పీ రోహిత్ రాజు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలోని వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ హామీ ఇచ్చారు. శనివారం ఏడూళ్ల బయ్యారం పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల వలస గుత్తి కోయ గ్రామాలైన తిర్లాపురం, మల్లారం, పిట్టతోగు గ్రామాలలో ప్రజలకు పిట్టతోగు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వైద్య శిబిరానికి కిష్టాపురం గ్రామం నుండి ద్విచక్ర వాహనాలపై దట్టమైన అడవిలో వాగులు, వంకలు దాటుకుంటూ జిల్లా ఎస్పీ పిట్టతోగు గ్రామానికి చేరుకొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి సుమారుగా 65 కుటుంబాలు, 300 మంది ఆదివాసీ ప్రజలు హాజరయ్యారు.
ఎస్పీ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వలస గుత్తి కోయ గ్రామాలకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. వలస ఆదివాసి ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలను కల్పించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీసు అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలన్నింటిని ఆదివాసి ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారి ఆదివాసి ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ వేధింపులు తట్టుకోలేక చాలా మంది దళసభ్యులు, నాయకులు లొంగిపోతున్నారని వివరించారు.
ఎవరైనా కొత్త వ్యక్తులు తమ గ్రామాల్లోకి ప్రవేశిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం గ్రామస్తులందరికీ సోలార్ లైట్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. యువతకు వాలీబాల్ కిట్లు, స్కూల్ పిల్లలకు నోటుబుక్స్ అందజేశారు.
ఈ వైద్య శిబిరంలో పాల్గొని గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్య బృందానికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రాజ్ కుమార్, రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment