సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి : ఎస్పీ

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పైన ఉన్న డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సెంటర్‌ను సందర్శించారు. ఇప్పటివరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల వివరాలు, ఆ కేసుల పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం పాటిస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారులకు సూచించారు.


కంటికి కనబడకుండా ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేలా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేస్తూ విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ జితేందర్, ఎస్సైలు రవి, జుబేదా బేగం, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.