నకిలీ రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలి..ఎస్పీకి కొత్తగూడెం జర్నలిస్టుల వినతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం జిల్లాలో రిపోర్టర్లమంటూ చలామణి అవుతున్న నకిలీలపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్కు కొత్తగూడెం జర్నలిస్టులు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు యూట్యూబ్, పిడిఎఫ్, నాన్ రికగ్నైజ్డ్ పత్రికలు వంటి సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకొని రిపోర్టర్లుగా ముసుగు ధరించి తిరుగుతూ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దృష్టి సారించి కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు జిల్లా ఎస్పీని కోరారు.
అదేవిధంగా జిల్లా ప్రెస్ క్లబ్ పేరుతో ఈ నకిలీ విలేకరులు వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. ఇకపై నకిలీ రిపోర్టర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజమైన జర్నలిస్టులు ఆధారపూరితంగా అవినీతి, అక్రమాలపై వార్తా కథనాలు ప్రచురించి సమాజానికి మేలు చేసేవారని, కానీ కొందరు నకిలీ జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఇకపై ఎవరైనా అనుమతి లేని యూట్యూబ్, పిడిఎఫ్, నాన్ రికగ్నైజ్డ్ పత్రికల పేర్లతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఇమంది ఉదయ్ కుమార్, పండుగ రేశ్వంత్, చావా పాపారావు, నరసింహారావు, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment