చిన్నారులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్య నేరం - న్యాయమూర్తి జి.భానుమతి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :బడి ఈడు పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.భానుమతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ - హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం "బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన" క్యాంపెన్ లో భాగంగా బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి కొత్తగూడెంలోని చిన్న బజార్, పెద్ద బజారులలోని కిరాణా షాపు, షాపింగ్ మాల్స్, వ్యాపార సంస్థలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
తనిఖీలలో భాగంగా చిన్న బజార్ లోని రాయల్ కిరాణా షాపులో బాల కార్మికుడిని గుర్తించారు. బాలుడి వివరాలను తెలుసుకొని అతడి తల్లిని పిలిపించి, పిల్లవాడిని తప్పనిసరిగా బడిలో చేర్పించాలని ఆదేశించారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే బాల కార్మిక చట్టం ప్రకారం పనిలో పెట్టుకున్న యజమాని పైన కేసును నమోదు చేయడం జరుగుతుందని కిరాణా షాప్ యజమానిని న్యాయమూర్తి హెచ్చరించారు.
ఆ బాలుడిని తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించే బాధ్యతను షాప్ యజమాని, తల్లి తీసుకొని స్కూల్ లో అడ్మిషన్ చేయించిన వివరాలను తెలియపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ తనిఖీలో కొత్తగూడెం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహమ్మద్ షర్ఫుద్దీన్, న్యాయవాది మెండు రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment