ప్రజలు పండగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి - జిల్లా ఎస్పీ

ప్రజలు పండగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి - జిల్లా ఎస్పీ

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో 'క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్' ద్వారా నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. 

కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాబోయే గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని సూచించారు.

 గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నియమ నిబంధనలను గురించి వివరించి వాటిని పాటించేలా చేయాలని తెలిపారు. శోభాయాత్ర సమయాలలో డీజేలు పెట్టడం, టపాసులు కాల్చడం వంటివి నిషేధమని గణేష్ ఉత్సవ కమిటీ వారికి తెలియజేయాలని సూచించారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర సమయంలో పకడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను చేయాలని తెలిపారు. 

అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న పలు కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి తమ తమ నివాస ప్రాంతాల్లో, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు. ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరతగతిన అందేలా చూడాలని తెలిపారు. 

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి, బాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

 పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్, ఇల్లందు డిఎస్పీ చంద్రభాను, మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు

Blogger ఆధారితం.