మణుగూరులో "కమ్యూనిటీ కనెక్ట్" కార్యక్రమం...44 బైకులు, 4 ఆటోలు సీజ్
ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికీ వెళ్లి పోలీసులు సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని నాలుగు ఆటోలు, నలభై నాలుగు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. జరిమానాలు విధించి, వాహనాల యజమానులపై తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నిషేధిత మత్తుపదార్థాల కలవరాన్ని అరికట్టేందుకు నార్కోటిక్ డాగ్స్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. గంజాయి వంటివాటిపై కఠిన నిఘా కొనసాగుతున్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులతో సమావేశమయ్యిన డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల సమాచారం దొరికిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలుగా ఈ తరహా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతంలో ఎదురవుతున్న సమస్యలను పోలీసులకు తెలియజేస్తే సంబంధిత అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అలాగే కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని, నేర నివారణకు పోలీసులకు సహకరించాలని సూచించారు.

Post a Comment