ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకుల చేతిలో దేశం మగ్గుతోంది - ఎమ్మెల్యే కూనంనేని
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకుల చేతిలో దేశం మగ్గుతోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం పాల్వంచ పట్టణ పరిధిలోని వాసవి బ్యాంకెట్ హాల్లో సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని, అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తున్నదని, అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టి సీబీఐ, ఈడీ ద్వారా దాడులు జరుపుతూ ప్రతిపక్షాలను భయపెడుతున్నారని విమర్శించారు. "మావోయిస్టులను మార్చ్ వరకు లేకుండా చేస్తాం" అన్న అమిత్ షా ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తూ, ప్రశ్నించే గొంతుకలను నలిపివేయడం బీజేపీ ఎజెండాగా పెట్టుకుందని విమర్శించారు.
పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సీపీఐ అని, సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, ప్రజలకు ఏ కష్టమొచ్చినా గుర్తొచ్చేది ఎర్ర జెండానే అని అన్నారు. సమ సమాజ స్థాపన, సోషలిస్టు రాజ్య సాధనే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకోసం ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడమని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని, పొత్తులు లేదా సర్దుబాట్లు ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని తెలిపారు. జిల్లాలో ప్రతి పంచాయతీలో సీపీఐకి ప్రాతినిధ్యం వచ్చేలా కార్యకర్తలు, నాయకులు కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా సీపీఐ శత వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ వేడుకల ద్వారా పార్టీ ప్రజా సంఘాలను మరింత బలోపితం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, పుల్లారెడ్డి, సలీం, సారయ్య, కల్లూరి వెంకటేశ్వరరావు, కమటం వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మి కుమారి, నారాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివాస్, రేసు ఎల్లయ్య, దేవరకొండ శంకర్, పట్టణ మండల కార్యదర్శులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాసిరెడ్డి మురళి, భూక్య దస్రు, బంధం నాగయ్య, గుగులోత్ రామ్ చందర్, సుధాకర్, రామకృష్ణ, సతీష్, బుర్ర కేశవరావు, నారాయణ, ఎండి యూసుఫ్, ధర్మ, గుగ్గిల కృష్ణ, జిల్లా సమితి సభ్యులు, ప్రజాసంఘాల జిల్లా బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment