పెద్దమ్మగుడిలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

పెద్దమ్మగుడిలో ఘనంగా పవిత్రోత్సవాలు  ప్రారంభం

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి) నందు పవిత్రోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్గశిర బహుళ దశమి నుండి ద్వాదశి వరకు మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు భక్తుల సర్వమంగళం కోసం ప్రత్యేక శాస్త్రోక్త పూజా కార్యక్రమాలతో నిర్వహించబడుతున్నాయి.

ఉత్సవాల ప్రారంభం వేదమంత్రాల నడుమ గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాకంకణధారణ తదితర పూజలతో ఘనంగా జరిగింది. యాగశాలలో శోడషస్థంభ పూజ, అఖండదీపారాధన, సప్తశోడషమాతృక పూజ, సర్వతోభద్ర మండపారాధన వంటి విశిష్ట పూజలు అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.

సాయంత్రం 4 గంటలకు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, భక్తులు సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడ మృత్తికా సంగ్రహణ (పుట్టబంగారం) చేసి, దానిని యాగశాలకు తీసుకువచ్చి పవిత్రాలను మండపానికి ఘనంగా తీసుకువచ్చారు.

ఈ పవిత్రోత్సవాలలో దేవస్థాన అర్చకులు శ్రీ ఎ.ఎస్.కె. సంతోష్, ఖమ్మం ప్రాంతానికి చెందిన ఋత్వికులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

ఉత్సవాల రెండవ రోజైన 26 డిసెంబర్ 2024, గురువారం మధ్యాహ్నం చండీహోమం నిర్వహించబడనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా దేవస్థాన అధికారులు కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎన్. రజనీకుమారి, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.