రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తుల పరిశీలనను రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా లో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, జల్ సంచయ్ జెన్ భాగిదారి అమలుపై ఐటిడిఏ పీఓ రాహుల్‌తో కలిసి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా పూర్తిచేసి, అర్హులైన వారి జాబితా రూపొందించాలన్నారు. పరిశీలన పూర్తైన దరఖాస్తులను ట్రైబల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ కార్పొరేషన్ల వారీగా విభజించాలన్నారు. విభజించిన దరఖాస్తులను బ్యాంక్ అధికారుల పరిశీలన నిమిత్తం అందించాలన్నారు.

రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితాలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం మండల ప్రత్యేక అధికారులు జాబితాను బ్యాంకులకు అందించాలని సూచించారు. బ్యాంకర్లు సమన్వయంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్ పుస్తకం, సదరం సర్టిఫికెట్ తదితర ధ్రువపత్రాలను తప్పనిసరిగా పరిశీలించి, దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హులను ఎంపిక చేయాలన్నారు.

జనాభా ప్రాతిపదికన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, గ్రామంలో ఒక యూనిట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని పరిశీలించాలని ఆ కార్పొరేషన్ల అధికారులను ఆదేశించారు. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో వచ్చిన దరఖాస్తుల నివేదికలు రూ.50,000 నుండి రూ.5 లక్షల వరకు విడిగా అందించాలన్నారు. మండల కమిటీ నుంచి వచ్చిన జాబితా ఆధారంగా మే 21 నుండి 30 తేదీల మధ్య జిల్లా స్థాయి కమిటీ పరిశీలన అనంతరం అర్హులైన వారికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న మంజూరు పత్రాలు అందించాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లకు గాను ఇప్పటికే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామపంచాయతీని ఎంపిక చేశామని, మిగిలిన గ్రామపంచాయతీల్లో లబ్ధిదారుల అర్హుల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తమ వద్దకు వచ్చిన జాబితాను సంబంధిత మండలాల ఎంపీడీవోలు లేదా మున్సిపల్ కమిషనర్లకు అందజేసి, వారు స్థానికంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుని జాబితాలో ఉన్న పేదల్లో నిజంగా నిరుపేదులను గుర్తించి అర్హుల జాబితా రూపొందించాలన్నారు. జాబితాలో పేరు లేని ఎవరైనా నిజంగా నిరుపేదులుంటే వారి పేర్లను కూడా జతచేసి అర్హుల జాబితా తయారు చేసి, స్థానిక శాసనసభ్యుల సహకారంతో జాబితాను తుదిరూపం ఇవ్వాలని పేర్కొన్నారు.

జల్ సంచయ్ జెన్ భాగిదారి అమలు వేగవంతం:

జల్ సంచయ్ జెన్ భాగిదారి అమలులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. రాబోయే వర్షాకాలంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా ఈ గుంతలను నిర్మిస్తున్నామని, చేపట్టిన ప్రతి ఇంకుడు గుంత ఫోటోలను జెఎస్‌జెబీ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని చెప్పారు.

దేశంలో ఇంకుడు గుంతల నిర్మాణంలో మన జిల్లా మొదటి స్థానానికి చేరువలో ఉందని, తొలి స్థానం పొందిన వారికి రూ.2 కోట్ల బహుమతి లభిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ఫామ్ పాండ్స్ కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని, నిన్న ఒక్కరోజే 230 ఫామ్ పాండ్స్‌కి మార్కింగ్ చేశామని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలంలో ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, వసతిగృహాల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా మరోనాడు ఆ గుంతలను నిర్మించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Blogger ఆధారితం.