బాల కార్మికులు కనిపిస్తే సమాచారం అందించండి - ఎస్పీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కోరారు.
జనవరి 1 నుండి 31వ తారీఖు వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్-XI లో భాగంగా పోలీస్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆయన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు సబ్ డివిజన్ల అయిన కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు లో 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి, జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం కృషి జరుగుతుందని తెలిపారు.
అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ స్మైల్ - XI కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన, కిరాణం షాపులు, మెకానిక్ షాపులలో, హోటళ్లలో, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న బాల కార్మికులను మరియు వదిలివేయబడిన పిల్లలను, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి అప్పగించడం లేదా చైల్డ్ కేర్ హోమ్ కు పంపించడం జరుగుతుందన్నారు.
చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై నూతన చట్టాలను అనుసరించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ గారు హెచ్చరించారు. బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకుని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే 1098, డయల్ 100కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని భాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు.
అనంతరం ఆపరేషన్ - స్మైల్ XIకి సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశ నిర్వహణతో పాటు, వివిధ విభాగాల అధికారులతో కలిసి ఆపరేషన్ స్మైల్-XI పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్, ఆపరేషన్ స్మైల్ పోలీస్ నోడల్ ఆఫీసర్ డిఎస్పీ అబ్దుల్ రెహమాన్, డిసిఆర్బి డి.ఎస్పీ మల్లయ్య స్వామి గౌడ్, డిఎం అండ్ హెచ్ ఓ భాస్కర్ నాయక్, డిడబ్ల్యుఓ స్వర్ణలత లెనినా, సిడబ్ల్యుసి సభ్యులు అంబేద్కర్, సాదిక్ పాషా, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ షర్ఫుద్దీన్, నాగరాజు, యేసుపాదం, శాస్త్రి, డీసీపీవో హరి కుమారి, చైల్డ్ లైన్ కో-ఆర్డినేటర్ సందీప్, ఏ.హెచ్.టి.యు ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సైలు రమాదేవి, రాకేష్, తిరుపతి, నాగబిక్షం, రామకృష్ణ, సూర్యం, డివిజన్ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, ఆపరేషన్ స్మైల్-XI టీంలు పాల్గొన్నారు.

Post a Comment