ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అధికారులు పూర్తిస్థాయిలో సహకరించి టీఎస్-ఐపాస్, టీ-ప్రైడ్ కింద అర్హతలు ఉన్న పరిశ్రమలకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన టీఎస్-ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని అధికారులతో కలిసి నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు జిల్లా ఎంతో అనుకూలంగా ఉందని, దీంతో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. వారికి అన్ని రకాల అర్హతలు ఉంటే, త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని సూచించారు.
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా టీఎస్-ఐపాస్, టీప్రైడ్ కింద పీఎం ఈజిపి, పీఎం ఎఫ్ఎంఈ, ముద్ర రుణాలు వంటి పథకాలు మరియు డీఆర్డీఏ ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా పరిశ్రమలు స్థాపించాలన్నారు. టీప్రైడ్ పథకం ద్వారా 35% మరియు 45% సబ్సిడీ పొందవచ్చు అన్నారు. అలాగే టీఎస్-ఐ-పాస్ కింద పరిశ్రమలకు కావాల్సిన వివిధ అనుమతులు మంజూరు, పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో మినీ రైస్ మిల్లు, చేపల పెంపక యూనిట్లు, ఆయిల్ ఫార్మ్స్, మేజ్ పరిశ్రమలు, కులవృత్తులకు చేయూత, రవాణా వాహనాలు తదితర పరిశ్రమలు జిల్లా లో ఏర్పాటు చేయాలని, తద్వారా గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు.
అదేవిధంగా అశ్వాపురం భారజాల కర్మాగారం అణుజల ఉత్పత్తి అనంతరం మిగిలిన నీటిని వృధాగా వదిలేస్తున్నారని, ఆ నీటిలో ఎంతో పోషక విలువలతో కూడుకుని ఉంటాయని, కాబట్టి ఆ నీటి ఉపయోగంతో మినరల్ వాటర్ ప్లాంటు స్థాపించడం ద్వారా స్థానిక గిరిజనులు అభివృద్ధి చెందవచ్చన్నారు. అదేవిధంగా కర్మగారంలో ఫ్లై యాష్ ఉపయోగంతో ఇటుకల తయారీ పరిశ్రమలు నెలకొల్పటానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గిరిజనులకు అందించే రుణాలపై అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి తిరుపతయ్య, ఐపిఓ పృథ్వి, జిల్లా ఫైర్ అధికారి క్రాంతి కుమార్, జిల్లా మైనింగ్ అధికారి దినేష్, ఎల్ డి ఎం రామ్ రెడ్డి, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారి రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment