గంటేటికి కోర్టులో దక్కని ఊరట..క్రిమినల్ అప్పీల్ కొట్టివేత
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:చెక్కు బౌన్స్ కేసులో క్రిమినల్ ఆప్పీల్ను కొట్టివేస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీకి చెందిన గంటేటి కృష్ణ, వినాయక ఎంటర్ప్రైజెస్ తరఫున పాల్వంచకు చెందిన మిరియాల అలివేలు వద్ద రూ. 5 లక్షల నగదు 2011 మార్చి 7న తీసుకున్నారు. డబ్బులు చెల్లించనందున మిరియాల అలివేలు డిమాండ్ చేయగా, 2013 అక్టోబర్ 3న కృష్ణ తన ఖాతా నుండి రూ. 7 లక్షల చెక్కు ఇచ్చాడు. అలివేలు తన బ్యాంకు ఖాతాలో ఆ చెక్కును జమ చేయగా అది బౌన్స్ అయింది.
తర్వాత లాయర్ నోటీసు ఇచ్చినప్పటికీ డబ్బులు చెల్లించకపోవడంతో మిరియాల అలివేలు చెక్కు బౌన్స్ కేసును కోర్టులో దాఖలు చేశారు. విచారణ అనంతరం అప్పటి రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం. నీలిమ 2021 ఆగస్టు 31న తీర్పు ఇవ్వగా, గంటేటి కృష్ణ రూ. 14 లక్షలు చెల్లించాలని, ఒక సంవత్సరం కారాగార శిక్ష విధించారు.
ఈ తీర్పుపై గంటేటి కృష్ణ కొత్తగూడెం జిల్లా కోర్టులో అప్పీల్ దాఖలు చేయగా, ఇరుపక్షాల వాదనలు విని కింద కోర్టు తీర్పును ఖరారు చేస్తూ అప్పీల్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. మిరియాల అలివేలు తరఫున లక్కినేని సత్యనారాయణ బృందం వాదించారు.

Post a Comment